MPDO Transfers | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవో మేరకు ఎంపీడీవోల బదిలీలు, పోస్టింగ్ కోసం ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కోరింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు(సీఈవో), తమ పరిధిలో పనిచేస్తున్న ఎంపీడీవోల పూర్తి వివరాలను సమర్పించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అవసరమైన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీల రూపంలో మే 1 లోపు ఈ-సెక్షన్ మెయిల్ ఐడీకి (cpr.e.section@gmail. com) పంపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మే మొదటి వారం తర్వాత బదిలీల తుది జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నది.
త్వరలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో మేరకు, గ్రేడ్-I, II, III పంచాయతీ కార్యదర్శుల బదిలీ లు, పోస్టింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, తమ పరిధి లో పనిచేస్తున్న అర్హులైన పంచాయతీ కార్యదర్శుల పూర్తి వివరాలను సమర్పించాలని శుక్రవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు.
